Gopuram:నల్లగొండ జిల్లాలో పిల్లలమర్రి దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల నాటిది . తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాల్లో ఒకటి. పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు.
క్రీ.శ1230 న శ్రీ ఎరకేశ్వర దేవరను ప్రతిష్ఠించినట్లు శాసనం లో వ్రాయబడింది. ఈ ఆలయ ద్వారబంధాలు, రంగమండపము, స్థంభాలు, అంత్రాలయ ద్వారబంధము. గర్భాలయ ద్వారశిల్పము , ఒకటేమిటి అడుగడుగునా ఈ ఆలయ శిల్ప సంపద యాత్రీక భక్తుల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. ఆలయ ద్వారబంధాలన్నీ శిలానిర్మితాలే. గుమ్మం దాటాలంటే సామాన్యుల అంగ చాలదు.3అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు మండిగాలే ఉన్నాయంటే ఇక ఆలయ నిర్మాణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. .
తూర్పు, ఉత్తర ,దక్షిణ ద్వారాలకు ఎత్తైన మెట్లు , బాహ్యమండపాలు ఉండాలి. అవి పతనమై పోయి, వచ్చిన ప్రేక్షకుల్ని తెల్లబోయి చూస్తున్నట్టుంటాయి. ఈ ఆలయానికి శిఖరం లేదు. గర్భగుడి లో శ్రీ ఎఱకేశ్వరుడు పానుమట్టం తో సహా ఎడమ వైపు నేలలోకి ఒరిగి పోయుంటాడు. భూకంపము వచ్చినప్పుడు అలా ఒరిగి పోయాడట. మూడున్నర నాలుగడుగుల కైవారం కల్గిన సుమారు రెండడుగుల ఎత్తు గల నల్లని సాలగ్రామ శిలలో కాంతులీనుతుంటాడు శ్రీ ఎఱకేశ్వర స్వామి
ద్వారబంధాలు,ముఖమండప స్థంభాలు, ప్రవేశ ద్వారాలు, పైకప్పు ఒకటేమిటి అన్నిచోట్ల లతలు,పుష్పాలు, వివిధభంగిమలలో నాట్య గత్తెల రూపాలు, వాద్యకారులు శిల్పుల చేతుల్లో మైనపు ముద్దల వలె ఒదిగిపోయి రమణీయ శిల్పాలై కొలువు తీరి కన్పిస్తాయి. పురాణాల ప్రకారం ఇక్కడ ఏడెకరాలకు పైగా విస్తరించిన పిల్లలమర్రి చెట్టు ఉండేది. ఒకరోజు ‘పెద్ద భూకంపం రాబోతోందనీ, చెట్టు నేలకొరుగుతుందనీ, ఆ చెట్టు కింద ఘనమైన ఖనిజ సంపద ఉందనీ… చెట్టు మీది పక్షులు పలుకుతుండగా… ఒక గిరిజనుడు విన్నాడట. ఆ సంగతి ఆ ప్రాంత పాలనాధికారి బేతిరెడ్డికి చెప్పాడు. కొద్దిసేపటికే ఆ జోస్యం నిజమైంది. చెట్టు నేలకొరుగగా, దాని కింద అపార ఖనిజ సంపద లభ్యమైంది. అదంతా స్వాధీనం చేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికంగా చెప్పుకుంటారు.