KTR: తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ రేవంత్ చేసిన కామెంట్లు ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని టీపీసీసీ చీఫ్ వార్నింగ్ ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ విషయం గులాబీ పార్టీ పెద్దల వరకూ చేరినట్టుంది. రేవంత్ డైలాగ్స్ కు.. ప్రగతి భవన్ నుంచి రీసౌండ్స్ వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ టాపిక్ ను అసెంబ్లీలోనే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. అంటే, రేవంత్ డైలాగ్ డైనమైట్లా పేలినట్టే ఉంది. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే…
“ప్రగతి భవన్ను పేల్చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా? ఇంత అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడొచ్చా? అధ్యక్షుడి మాటలను సమర్థిస్తూ వారి సభ్యురాలు సభలో మాట్లాడొచ్చా?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుందని.. ఇకనైన వారి వైఖరి మార్చుకోవాలని కేటీఆర్ మండిపడ్డారు.
మరోవైపు, ధరణి పోర్టల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ధరణిని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ విధానమా? అని నిలదీశారు. పార్టీ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తామంటున్నారు.. శ్రీధర్ బాబేమో మరోలా మాట్లాడుతున్నారు. అధ్యక్షుడికి, నాయకులకు సమన్వయం లేకపోతే ఎలా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని.. ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రావడం లేదని కేటీఆర్ అన్నారు.