T20I Rankings:టీ-20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లు… ర్యాంకుల్లో రాకెట్ స్పీడుతో దూసుకొచ్చారు. బ్యాటింగ్ విభాగంలో యువ సంచలనం శుభ్మన్ గిల్ ఏకంగా 168 స్థానాలు ఎగబాకి 30వ స్థానానికి చేరుకోగా… ఆల్రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా రెండో స్థానానికి వచ్చేశాడు. నెంబర్ వన్ పొజిషన్ కు పాండ్యా చాలా దగ్గరగా ఉన్నాడు. ఇక బౌలర్లలో అర్షదీప్ సింగ్ 8 స్థానాలు మెరుగుపరుచుకుని, 13వ స్థానానికి చేరుకున్నాడు.
తాజా టీ-20 ర్యాంకుల ప్రకారం సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్లలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆల్టైమ్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించడానికి స్కై కేవలం 9 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. ఇప్పటిదాకా టీ-20ల్లో డేవిడ్ మలాన్ అత్యధికంగా 915 పాయింట్లు సాధించగా ప్రస్తుతం స్కై ఖాతాలో 906 పాయింట్లు ఉన్నాయి. మరొక్క టీ-20 సిరీస్లో దంచికొడితే… సూర్యకుమార్ కొత్త రికార్డు సృష్టించడం ఖాయం. టీ-20 బ్యాటర్ల జాబితాలో స్కై తర్వాత మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, డెవాన్ కాన్డే, డేవిడ్ మలాన్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, గ్లెన్ ఫిలిప్స్, అలెక్స్ హేల్స్ టాప్-10లో ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో 14 స్థానం నుంచి 15వ స్థానానికి పడిపోగా… కేఎల్ రాహుల్ 2 స్థానాలు కోల్పోయి 27కు, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 28 నుంచి 29 స్థానానికి చేరుకున్నారు. టాప్-30లో మొత్తం ఐదుగురు టీమిండియా బ్యాటర్లు ఉన్నారు.
బౌలింగ్ కేటగిరిలో రషీద్ ఖానే ఇప్పటికీ నెంబర్ వన్. అతని తర్వాత వనిందు హసరంగ, ఆదిల్ రషీద్, జోష్ హేజిల్వుడ్, శామ్ కరన్, తబ్రేజ్ షంషి, ఆడమ్ జంపా, ముజీబుర్ రెహ్మాన్, అన్రిచ్ నోర్జే, మిచెల్ సాంట్నర్ టాప్-10లో ఉన్నారు. బౌలర్ల టాప్-30 జాబితాలో టీమిండియా ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. అర్షదీప్ 13, భువనేశ్వర్ కుమార్ 21, అశ్విన్ 29, అక్షర్ పటేల్ 30వ స్థానంలో నిలిచారు.
ఇక ఆల్రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్దే టాప్ ర్యాంక్. అతని తర్వాత హార్ధిక్ పాండ్యా, మహ్మద్ నబీ, హసరంగ, జెజె స్మిత్, సికందర్ రజా, డేవిడ్ వీస్, స్టొయినిస్, మొయిన్ అలీ, మ్యాక్స్వెల్ టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలో అగ్రస్థానానికి చేరుకునేందుకు హార్ధిక్ పాండ్యా కేవలం 2 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు.