Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 15 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న క్రమంలో.. ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలతో పాటు త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలకు షెడ్యూల్ను రిలీజ్ చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో జరగనున్నాయి.
ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరి 16న ఈసీ రిలీజ్ చేయనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. 27వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్లు లెక్కించి తుది ఫలితాలను వెల్లడించనున్నారు.