Adani shares:హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటికొచ్చాక కుదేలైన అదానీ గ్రూపు షేర్లు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. రెండు కంపెనీల షేర్లు మినహా… అదానీ గ్రూపులోని మిగతా కంపెనీల షేర్లు కనిష్ట స్థాయిల నుంచి బాగా పెరిగాయి. రెండు కంపెనీల షేర్లు అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా పెరిగాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఇటీవల రూ.1,017 వద్ద కనిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో 50 శాతానికి పైగా పెరిగి… ఇప్పుడు రూ.2,164 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేరు ఇటీవల రూ.395కు పడిపోయింది. అది కూడా ఇప్పుడు 50 శాతం పెరిగి రూ.600 స్థాయికి చేరింది. ఇక అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, అదానీ విల్మర్ కంపెనీల షేర్లు తాజాగా ఒక్కోటీ 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. అయితే, ఈ మూడు కంపెనీలు ఇటీవలి కనిష్ట స్థాయి నుంచి పది శాతానికి అటూ ఇటుగానే పెరిగాయి. ఈ మధ్యే కొన్న అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు కూడా ఫరవాలేదనిపిస్తున్నాయి. అంబూజా సిమెంట్స్ షేరు ఇటీవలి కనిష్ట స్థాయి నుంచి 25 శాతం దాకా పెరగ్గా… ఏసీసీ షేరు ధర మాత్రం ఇటీవలి కనిష్టస్థాయి నుంచి 5 శాతానికి పైగా మాత్రమే పెరిగింది.
అయితే… అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీషేర్లలో మాత్రం… ఇంకా పతనం కొనసాగుతూనే ఉంది. అదానీ టోటల్ గ్యాస్ షేరు తాజాగా 5 శాతం పడిపోయి, రూ.1391కి చేరింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ షేరుది కూడా ఇదే పరిస్థితి. తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు తాజాగా 5 శాతం కుంగి… ఏడాది కనిష్ట స్థాయి అయిన రూ.802కు చేరింది. ఇక ఎన్డీటీవీ షేరు కనిష్ట స్థాయి నుంచి కాస్త మాత్రమే పెరిగింది.