Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగిపోతోంది. ఇరు దేశాల్లో ఎటుచూసినా శవాలు కప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 15 వేల మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు టర్కీలో 12, 391 మంది మరణించగా.. సిరియాలో 2, 992 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15, 383కు చేరుకుంది. అటు ఆసుపత్రుల్లోనూ వేలాది మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కూడా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. శిథిలాల కింద ఇంకా లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
టర్కీ అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ బుధవారం భూకంప బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈసందర్భంగా.. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో కన్పిస్తూనే ఉందని.. ఇలాంటి విపత్తుకు ముందుగానే సిద్ధంగా ఉండడం ఎవరికీ సాధ్యం కాదని వెల్లడించారు.
మరోవైపు శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు లేకపోవడంతో టర్కీ అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో టర్కీ రాజధాని ఆంకారా సహా పలు నగరాల్లో ట్విట్టర్ సహా పలు సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు.