Hyderabad : హైదరాబాద్ లో ఎటుచూసినా ట్రాఫిక్ జామ్లే. మూడురోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మంగళవారం, బుధవారం ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అంబులెన్స్ లకు దారి దొరకడంలేదు. రోడ్డు దాటడం పాదచారులకు గగనమవుతోంది. నగరవాసులకు మరికొన్ని రోజులు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేలాలేవు.
ట్రాఫిక్ జామ్ లు ఎందుకంటే..
ఉదయం 10 గంటల నుంచి నుంచి ట్రాఫిక్ జామ్ లు మొదలవుతున్నాయి. రాత్రి 11 గంటలు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగరంలో ప్రధాన మార్గాలు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మరో 10 రోజులు భాగ్యనగరంలో ఇదే పరిస్థితి తలెత్తనుంది. ఒకవైపు అంసెబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు ఈ నెల 11న ఫార్ములా-ఈ రేసింగ్ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయస్థాయిలో జరిగే పోటీలకు 21 వేల మందికిపైగా వస్తారని అంచనా వేస్తున్నారు. రేసింగ్ నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. రేసింగ్ జరిగే రోజు సికింద్రాబాద్-ట్యాంక్బండ్ వైపు వెళ్లేందుకు వాహనదారులను అనుమతించరు. వచ్చే శని, ఆదివారాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అదనంగా సిబ్బందిని రంగంలోకి దింపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 15 వరకు నాంపల్లిలో నుమాయిష్ జరుగుతుంది. ఈ నెల 17న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత రోజు శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. దీంతో మరో 10 రోజులపాటు నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేలాలేవు. ఖైరతాబాద్, లక్డికాపూల్ , నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీని ప్రభావం నగరంలో ఇతర ప్రాంతాలపైనా పడుతోంది.
హైదరాబాద్ లో రోజూ 30-40 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ సమస్యకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమంటున్నారు పోలీసులు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రోజూ సుమారు 17 వేల చలానాలు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రధాన మార్గాల్లో రోడ్లపై తోపుడుబండ్లు పెట్టడం, దుకాణాల వద్ద వాహనాలు నిలపటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో నగరంలో రెండురోజులపాటు తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.