CBI: కోర్టులేమో ఫాంహౌజ్ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. సర్కారేమో వద్దు వద్దు.. సీబీఐకి కేసు ఇవ్వొద్దంటూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. హైకోర్టు సింగిల్ జడ్జి.. హైకోర్టు డివిజన్ బెంచ్.. సుప్రీంకోర్టు.. ఇలా కింది నుంచి పైవరకూ.. న్యాయస్థానాల ముందు మొరపెట్టుకుంటూనే ఉంది. అయితే, ఎక్కడా ఊరట మాత్రం రావట్లే. కనీసం స్టే కానీ, స్టేటస్ కో కానీ ఇవ్వట్లే. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వానికి అంతుచిక్కడంలే.
సర్కారు బాధలు ఇలా ఉంటే.. సీబీఐ మాత్రం కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఫాంహౌజ్ కేసు ఫైల్స్ తమకు ఇవ్వాలంటూ పదే పదే లేఖలు రాస్తోంది. అలా ఇప్పటివరకూ ఐదుసార్లు లెటర్లు రాసింది. ఫస్ట్ లెటర్ గతేడాది డిసెంబర్ 31న రాయగా.. ఆ తర్వాత జనవరి 5, 9, 11న.. మళ్లీ లేటెస్ట్ గా ఫిబ్రవరి 6న తెలంగాణ సీఎస్ కు లేఖలు రాస్తూనే ఉంది. అయినా, కేసు వివరాలు సీబీఐకి అందజేయడం లేదు సిట్.
సీబీఐకి ఫైల్స్ ఇవ్వకుండా ఎన్నోరోజులు ఆపలేమనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. అందుకే, హడావుడిగా వరుసబెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. సీబీఐ నుంచి ఒత్తిడి వస్తోంది.. కేసు వివరాలు ఇవ్వాలంటూ పదే పదే అడుగుతోంది.. అందుకే అత్యవసరంగా తమ పిటిషన్ను విచారించాలంటూ కోర్టులకు మొరపెట్టుకుంటోంది. కానీ, న్యాయస్థానాల నుంచి అసలేమాత్రం ఊరట లభించట్లేదు. అటు, సుప్రీంకోర్టు సైతం కేసు విచారణను 17కు వాయిదా వేయడంతో.. అప్పటి వరకూ సీబీఐ చేతికి ఫాంహౌజ్ కేసు వెళ్లకుండా ఎలా ఆపాలో సర్కారుకు అర్థం కావట్లేదు.