Modi: మోదీ మంచి వ్యాఖ్యాత. దేశంలోనే ఆకట్టుకునేలా ప్రసంగించే వారిలో ఆయనే ముందుంటారు. మామూలు విషయాలనే చాలా అందంగా చెబుతుంటారు. ఇక, ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో మోదీ తర్వాతే ఎవరైనా. చరిత్రను తవ్వుతూ.. కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ.. ఈడీ, సీబీఐ తనిఖీలను ప్రస్తావిస్తూ.. లోక్ సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు ప్రధాని మోదీ. రాహుల్ గాంధీకీ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా పీఎం మోదీ ప్రతిపక్షాలపై విశ్వరూపం ప్రదర్శించారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి. భారత్ మాత్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపించామని.. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని.. ప్రతిరంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోందని.. జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది.. ఇవన్నీ కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని మోదీ సెటైర్లు వేశారు.
2004-14 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది.. భారీ కుంభకోణాలు జరిగాయి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది.. 2జీ, బొగ్గు స్కాం, కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగింది.. అవినీతిపై కొరడా ఝుళిపిస్తే దర్యాప్తు సంస్థలను తప్పుబడుతున్నారంటూ కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. గత 9 ఏళ్లుగా విపక్ష నేతలు ఆలోచన లేకుండా ఆరోపణలే చేస్తున్నారని.. ఆర్బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. విపక్ష నేతలు ఏకమవుతున్నది దేశం కోసం కాదు.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వల్లే ఒక్కటవుతున్నారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది.. అందుకు ఈడీకీ థ్యాంక్స్ చెప్పాలని మోదీ అన్నారు.
జమ్మూకశ్మీర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభను ప్రస్తావిస్తూ.. ‘‘ఇప్పుడు జమ్ముకశ్మీర్కు అందరూ వెళ్లివస్తున్నారు. గతంలో లాల్చౌక్లో జాతీయ జెండా ఎగురవేయడం ఓ కలగా ఉండేది. దమ్ముంటే లాల్చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తీవ్రవాదులు పోస్టర్లు వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాం. లాల్చౌక్లో స్వేచ్ఛగా జెండా ఎగురవేయగలుగుతున్నాం’’ అని అన్నారు మోదీ.
ఇక, మోదీ ప్రసంగానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ_జేఏసీ వేయాలని డిమాండ్ చేయగా.. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు బీఎర్ఎస్ ఎంపీలు.