Harish Rao: మంత్రి హరీశ్ రావు మంచి మాటకారి. కేసీఆర్, కేటీఆర్ లానే ఆకట్టుకునేలా ప్రసంగించడంలో ఎక్స్ పర్ట్. తాజాగా, అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ముగింపు సందర్భంగా ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రాసలు, పంచ్ లతో విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కావాల్సినంత పవర్ ఇచ్చినందునే ప్రజలకు తమకు ‘పవర్’ ఇచ్చారని.. పవర్ హాలిడే ఇచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు ‘హాలిడే’ ఇచ్చారంటూ సభలో మంత్రి హరీశ్ రావు పంచ్ డైలాగులు పేల్చారు. బీఆర్ఎస్ సర్కారు సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రైతులంతా సంబరపడుతుంటే.. ఇకపై అధికారం రాదేమోనని విపక్షాలు బాధపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిండు పున్నమిలోని వెన్నెలను చూడకుండా.. చందమామలోని మచ్చలను చూస్తున్నారని మండిపడ్డారు.
ప్రపంచమే ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించామని.. గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ సర్కారుదే అన్నారు హరీశ్ రావు. అయితే, చనిపోయిన వ్యక్తుల పేరు మీద కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
బీజేపీ మీదా విరుచుకుపడ్డారు హరీశ్ రావు. ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ.. ప్రభుత్వాలను పడగొడుతూ.. బీజేపీ అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. అమృత్కాల్ అని చెప్తున్న బీజేపీ పాలన.. దేశప్రజలకు ఆపద కాలంలా మారిందని మండిపడ్డారు.