Adani: అదానీ వ్యవహారం యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇన్వెస్టర్లు అంతా ఇండియా పేరు చెబితేనే హడలిపోతున్నారు. అంతలా దేశ ప్రతిష్టను డ్యామేజ్ చేసింది అదానీ గ్రూప్. స్టాక్ మార్కెట్లో షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మళ్లీ రికవరీ అవుతున్నాయి. ఇదంతా అదానీ పేరుతో భారత్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన విదేశీ కుట్ర అనేవారూ ఉన్నారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా అదానీ, మోదీ సంబంధాలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అదానీ అరాచకాలకు మోదీ మద్దతే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీని, బీజేపీని ఏకిపారేస్తున్నాయి ప్రతిపక్షాలు.
అయితే, ఓ బీజేపీ ఎంపీ మాత్రం అదానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వాటిని వేలం వేయాలని డిమాండ్ చేశారు. వచ్చిన డబ్బును అదానీ స్టాక్స్ లో నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలని అన్నారు. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారనే భావన ప్రజల్లో ఉంది.. దానిపై స్పష్టత ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే.. బీజేపీ పవిత్రతను నిరూపించుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. మోదీ, బీజేపీ గురించి ఇంతలా విరుచుకుపడే నేత ఇంకెవరు ఉంటారు.. ఆయనే ఫైర్ బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.
పనిలో పనిగా కాంగ్రెస్ కూ చురకలు అంటించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్ చెబుతోంది కానీ.. అదానీతో ఒప్పందాలు ఉన్న కాంగ్రెస్ నేతల గురించి తనకు తెలుసు అన్నారు.
మరోవైపు, కేంద్ర బడ్జెట్ పైనా తనదైన శైలిలో విమర్శలు చేశారు ఆర్థికవేత్త కూడా అయిన సుబ్రహ్మణ్యస్వామి. తాజా కేంద్ర బడ్జెట్ ఓ బోగస్ అని మండిపడ్డారు. ‘కొన్నేళ్లుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోంది. కానీ, వచ్చే ఏడాదికి 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి లేనిది ఇప్పుడెలా సాధ్యం? వ్యవసాయం, పరిశ్రమలకు బడ్జెట్లో ప్రాధాన్యతే లేదు. ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహం లేదని బడ్జెట్లో స్పష్టంగా తెలుస్తోంది’ అని సుబ్రహ్మణ్యస్వామి తప్పుబట్టారు.