KotamReddy: సింపుల్. వైసీపీ మొదటినుంచీ చెబుతున్నట్టే జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఆయన ఫ్రెండ్ రామశివారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. వాయిస్ రికార్డ్ మాత్రమేనని తేల్చేశారు. తనది అసలు ఐ ఫోనే కాదని.. ఆండ్రాయిడ్ ఫోన్ అని మీడియాకు చూపించారు. తనది ఐ ఫోన్ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అబద్దం చెప్పారని అన్నారు. తన ఫోన్లో ప్రతీ కాల్ రికార్డు అవుతుందని.. అలానే ఎమ్మెల్యే, తాను మాట్లాడుకున్న కాల్ కూడా రికార్డు అయిందని చెప్పారు. ఆ వాయిస్ రికార్డింగ్ ఓ కాంట్రాక్టర్ కు తన ఫోన్ నుంచి షేర్ అయిందంటూ.. జరిగిందంతా చక్కగా వివరించారు.
తాను, తన ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుకున్న మాటలు ట్యాపింగ్ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఆయన తన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు. ఆసక్తికరంగా.. కోటంరెడ్డి లేఖ రాసిన వెంటనే.. ఇన్నాళ్లూ బయటకు రాని ఆయన స్నేహితుడు సడెన్ గా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.
కోటంరెడ్డి ఫ్రెండ్ తో అసలు నిజం చెప్పిస్తామంటూ మొదటినుంచీ వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ, వారం గడుస్తున్నా కోటంరెడ్డి ఫ్రెండ్ రామశివారెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. ఇన్నాళ్లకు ఎంట్రీ ఇచ్చి.. తనది ఐ ఫోనే కాదంటూ.. అది ఫోన్ ట్యాపింగ్ కాదు వాయిస్ రికార్డింగే అంటూ.. తనపై ఎవరి ఒత్తిడి లేదంటూ.. సవివరంగా చెప్పడంతో ఇప్పుడు కోటంరెడ్డి కౌంటర్ ఏంటా అనే ఆసక్తి పెరిగింది.
ఇంతకీ ఇన్నాళ్లూ రామశివారెడ్డి ఎక్కడ దాక్కున్నట్టు? కోటంరెడ్డికి భయపడ్డారా? వైసీపీ పెద్దలకు బెదిరిపోయారా? కోటంరెడ్డి ఫ్రెండ్ చెప్పేదంతా నిజమేనా? లేదంటే, ఆయనతో అలా చెప్పించారా? అనేది కూడా తేలాల్సి ఉందంటున్నారు.