Nagababu:మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాల్లోనే స్పీడుగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తను చెప్పాలనుకున్న విషయాలను ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరో వైపు విమర్శల్లోనూ అస్సలు వెనక్కి తగ్గటం లేదు. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన దేని గురించి ట్వీట్ చేశారో తెలుసా!.. సాధారణంగా కొందరు విమర్శకులు సినిమాలను, అందులోని కంటెంట్ను తమ ప్రసంగాల్లో తప్పు పడుతుంటారు. సమాజంపై సినిమాల్లోని కంటెంట్ చెడు ప్రభావం చూపుతుందనేది వారి వాదన. అయితే వీరి వాదనపై నాగబాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సినిమాలను వ్యాపారంగానే చూడాలి తప్ప.. సమాజంలో మంచి కోసం సాధనంగా చూడకూడదని అంటూ ఆయన తనదైన స్టైల్లో ట్వీట్స్తో రెచ్చిపోయారు.
నాగబాబు చేసిన ప్రతి విమర్శల్లోనూ నిజం లేకపోలేదు. ఇంతకీ నాగబాబు తన ట్వీట్స్లో ఏమన్నారంటే.. ‘‘సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్.సినిమాల్లో ఏదన్నా ఓవర్గా ఉంటే సెన్సార్ బోర్డ్ ఉంది. దీనిపై కుహనా మేధావులు ఏడవకండి. సినిమాల్లో చూపించే వయొలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా . ఒక ఫిల్మ్ మేకర్గా ఒకటి నిజం ,సినిమాలు చేసేది ఎంటర్టైన్మెంట్ కోసమే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ .ఇది జస్ట్ బిజినెస్’’ అన్నారు.
ఆసక్తికరమైన విషయమేమంటే.. నాగబాబు ట్వీట్ను రీ ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. పర్ఫెక్ట్గా చెప్పావు అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా మెగా బ్రదర్స్కు వ్యతిరేకంగా చురకలు వేస్తున్నట్లు మాట్లాడే రామ్ గోపాల్ వర్మ ఇలా సపోర్ట్ ట్వీట్ చేయటం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్మే కాదు.. నెటిజన్స్ సైతం నాగబాబుకే మద్దతు తెలిపారు. అయినా ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్స్ ఎందుకు చేశారా! అనేది మరో వర్గాన్ని ఆలోచింప చేస్తున్న ప్రశ్న.