Modi: ప్రధాని మోదీ పార్లమెంట్ కు వచ్చారు. బ్లూ కలర్ జాకెట్ వేసుకుని రాజ్యసభలో ఎంట్రీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్.
అదేంటి? మోదీ ఇలాంటి జాకెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటారుగా? పూటకో డ్రెస్ మారుస్తుంటారుగా? ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంది? అనుకోవచ్చు. ఉంది. మోదీ వేసుకున్న బ్లూ జాకెట్.. అలాంటిది ఇలాంటిది కాదు. పక్కా ప్లాస్టిక్. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ వ్యర్థాలను రీసైకిల్ చేసి.. ఈ అందమైన జాకెట్ తయారు చేశారు. బ్లూ కలర్ జాకెట్ తో దేశానికి పర్యావరణ హితమైన.. గ్రీన్ మెసేజ్ ఇచ్చారు.
ఇంతకీ ప్రధాని మోదీకి ఈ జాకెట్ ఎక్కడిది అంటే దానికో కహానీ ఉంది. ఈ సోమవారం ఆయన బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్ 2023’ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో మోదీకి ఈ స్పెషల్ బ్లూ జాకెట్ ప్రజెంట్ చేసింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC. పెట్ బాటిల్స్ ను (పాలీఇథలిన్ టెరెఫ్తలేట్) రీసైకిల్ చేసి తయారు చేశారా జాకెట్ ను. ఆ జాకెట్నే ప్రధాని ధరించి బుధవారం పార్లమెంట్కు వచ్చారు.
పర్యావరణం రిలేటెడ్ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. గతంలో తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు మహాబలిపురం బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా ఏరివేసి ఆదర్శంగా నిలిచారు. ఇక స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ను ఎంతపెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా, తనకు బహుమతిగా వచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్డ్ జాకెట్ ను వేసుకొని పార్లమెంట్ కు వచ్చి.. యావత్ దేశానికి ఎన్విరాన్మెంటల్ మెసేజ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆయన వేసుకున్న ఈ బ్లూ జాకెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ టాపిక్ పై తెగ చర్చ నడుస్తోంది.