Chinese Spy Balloon : భారత్ పై చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. తాజాగా మన దేశంపై బెలూన్ నిఘా పెట్టింది. హెయినన్ ప్రావిన్స్ కేంద్రంగా బెలూన్లతో చైనా నిఘా కార్యక్రమాలు చేపడుతోంది. దక్షిణ తీరంలో బెలూన్ల ఎగురవేసి భారత్, జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైన్యం, ఆయుధాల మోహరింపుల సమచారం తెలుసుకుంటోంది. ఆ ఆపరేషన్ చైనా వాయుసేన ఆధీనంలో జరుగుతోంది. ప్రపంచంలోని 5 ఖండాల్లో చైనా ప్రయోగించిన బెలూన్లు కనిపించాయి. వివిధ దేశాల సైనిక కదలికలను డ్రాగన్ గమనిస్తోంది. చైనా నిఘా బెలూన్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డ్రాగన్ కొన్నేళ్లుగా ఇలాంటి నిఘా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
అమెరికా అప్రమత్తం.. బెలూన్ కూల్చివేత
తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని అమెరికా వెల్లడించింది. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరిస్తున్న విషయాన్ని మిత్ర దేశాలకు తెలిపింది. అమెరికాకు చెందిన డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి వెండీ షెర్మన్.. చైనా బెలూన్ వ్యవహారంపై 40 దౌత్య కార్యాలయాలకు సమాచారం తెలియజేశారు. జపాన్ లాంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను చైనా లక్ష్యంగా చేసుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.
చైనా ప్రయోగించిన బెలూన్ 200 అడుగుల ఎత్తు ఉందని గుర్తించారు. సముద్రంలో బెలూన్ కూల్చిన ప్రదేశం నుంచి అమెరికా దళాలు శకలాలను సేకరిస్తున్నాయి. ఈ శకాలను విశ్లేషించి బెలూన్ సాంకేతిక సామర్థ్యాలు, అది ఏ ఉపగ్రహాలతో అనుసంధానమైందో తెలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి డిజిటల్ సిగ్నేచర్లను సేకరించిందో తెలుసుకోనున్నారు. బెలూన్ నిర్మాణానికి ఉపయోగించిన పరికరాల సప్లై చైన్ను అమెరికా అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. అమెరికాలోనే అత్యున్నత నిపుణులు పనిచేసే ఎఫ్బీఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ బృందం శకలాలను విశ్లేషిస్తుంది. దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిన శకలాలను అమెరికా నౌకాదళం సేకరిస్తోంది.
అమెరికా కాల్.. చైనా నో రిఫ్లై..
బెలూన్ను కూల్చివేసిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చైనా రక్షణమంత్రితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ చైనా అధికారులు స్పందించలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు చైనా నిరాకరించిందని పెంటగాన్కు చెందిన బ్రిగేడియర్ జనరల్ ప్రాట్రిక్ రైడర్ తెలిపారు.