Gold Subscription Charges:ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ బాదేశాడు. అయితే ఈసారి వంతు బిజినెస్ అకౌంట్ హోల్డర్లది. ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కోసం ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు, ఐఓఎస్ యూజర్ల నుంచి నెలకు 11 డాలర్లు వసూలు చేస్తున్న మస్క్… తాజాగా బిజినెస్ ఖాతాదారులకు ఇచ్చే గోల్డ్ కలర్ బ్యాడ్జ్ కోసం నెలకు వెయ్యి డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించాడు. అంతేకాదు, బిజినెస్ అకౌంట్లకు అనుబంధంగా నిర్వహించే అకౌంట్లకు… నెలకు మరో 50 డాలర్లు అదనంగా చెల్లించాలని చెబుతున్నాడు. కొత్త ఫీజుల వివరాలను ట్విట్టర్ ఇప్పటికే బిజినెస్ ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా పంపినట్లు చెబుతున్నారు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కోసమంటూ… సబ్స్క్రిప్షన్ ఛార్జీల పేరుతో యూజర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నాడు… మస్క్.
గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకునే బిజినెస్ అకౌంట్ యూజర్ల ట్వీట్లు ఎక్కువ మందికి చేరేలా బూస్టింగ్ సర్వీస్ను అదనంగా అందిస్తామంటోంది… ట్విట్టర్. ఇప్పటికే గోల్డ్ కలర్ బ్యాడ్జ్ పొందిన బిజినెస్ ఖాతాదారులు… సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే, వారి ఖాతా వెరిఫికేషన్ బ్యాడ్జ్ను కోల్పోతుందని… ఈ-మెయిల్ ద్వారా ట్విట్టర్ సమాచారం ఇచ్చింది. కేవలం బిజినెస్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే గోల్డ్ కలర్ బ్యాడ్జ్ సబ్స్రిప్షన్కు సంబంధించి ఈ-మెయిల్స్ పంపుతోంది.
నిరుడు అక్టోబర్లో ట్విట్టర్ కొన్నాక… యూజర్లకు వారి అవసరాలకు అనుగుణంగా లేబుల్స్, బ్యాడ్జ్లు ఇవ్వనున్నట్లు డిసెంబర్లో ప్రకటించాడు… మస్క్. ఇందులో భాగంగా బిజినెస్ అకౌంట్లకు గోల్డ్ బ్యాడ్జ్, ప్రభుత్వ అకౌంట్లకు గ్రే బ్యాడ్జ్… సెలబిట్రీలు, పొలిటీషియన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారికి బ్లూ బ్యాడ్జ్ ఇస్తామని చెప్పాడు. చెప్పినట్లుగానే.. కలర్ వారీగా యూజర్లను విభజిస్తున్న మస్క్… భారీగా ఛార్జీలు విధించి ఆదాయాన్నీ పెంచుకుంటున్నాడు.