Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తగ్గేదే లేదంటూ ముందుకు వెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తన ఎటాక్ ను మరింత పెంచారు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. అపాయింట్మెంట్ లభించగానే నేరుగా వెళ్లి కేంద్రం హోంశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
మంత్రులు, వైసీపీ నేతలను మరోసారి కోటంరెడ్డి గట్టిగా టార్గెట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఆరోపిస్తే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని సవాల్ చేశారు. తనకు కేసులు కొత్త కాదని స్పష్టం చేశారు. దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానని తేల్చిచెప్పారు. అన్నింటికీ తెగించిన వాళ్లే తనతో ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడతామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తాపత్రయ పడుతున్నానని కోటంరెడ్డి చెప్పారు. రోడ్లు, వాటర్ వర్క్స్పై మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ పనులు ఆపేయడం వల్ల ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చిందన్నారు. సగంలో పనులు నిలిచిపోయాయని మండిప్డడారు. ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేస్తే సరిపోతుందని.. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు సమస్యను సీఎం జగన్ కు నేరుగా చూపించానని గుర్తు చేశారు. ఇప్పటికికైనా ప్రభుత్వం నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలపై పోరాటానికి కోటంరెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని పెండింగ్ పనులు, రోడ్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఈ నెల 25న ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని అని కోటంరెడ్డి స్పష్టం చేశారు.