Fixed Deposits:డబ్బు విషయంలో భారతీయులకు జాగ్రత్త చాలా ఎక్కువ. మనలో చాలా మంది పక్కా లెక్కలతో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కొద్దిగా ఖర్చు చేస్తూ, భవిష్యత్ అవసరాల కోసం కొద్దిగా దాచుకోవడం అందరూ చేసే పనే. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాలు, బాండ్లు, పోస్టాఫీస్ పొదుపు పథకాలు… ఇలా చాలా మార్గాల్లో జనం డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు. అయితే… ఎన్ని పథకాలు ఉన్నా, ఫిక్స్డ్ డిపాజిట్కు ఉన్న లెక్కే వేరు. దేశంలో ఇప్పటికీ ఎఫ్డీల్లోనే ఎక్కువ మంది పొదుపు చేస్తున్నట్లు… ఓ సర్వేలో వెల్లడైంది.
ఒక్కసారి ఎఫ్డీలో డబ్బు పెడితే… నష్ట భయం లేకుండా… అసలుతో పాటు ఎంతో కొంత వడ్డీ వస్తుందనే కారణంతో ఇప్పటికీ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లకే మొగ్గు చూపుతున్నారని… కువేరా అనే ‘ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్’ సంస్థ తేల్చి చెప్పింది. ఏకంగా 16 లక్షల మంది దగ్గరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటే… వారిలో 70 శాతం మంది… ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత సేఫ్ అనేది వివరించారు. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కారణంగా ఎఫ్డీ ఎంచుకుంటున్నామని 44 శాతం మంది చెబితే… 23 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు తమ డబ్బును ఎఫ్డీల్లో పెడుతున్నారు. మరికొందరు మాత్రం… ఎప్పుడు కావాలంటే అప్పుడు సురక్షితంగా డబ్బును వాపస్ తీసుకునేందుకు ఎఫ్డీలను మించింది లేదన్నారు.
ఇప్పుడే కాదు… ఎప్పుడో ఆరేళ్ల కిందట సెబీ నిర్వహించిన సర్వేలోనూ… మెజార్టీ జనం ఎఫ్డీలకే జై కొట్టారు. ఆనాటికీ, ఇప్పటికీ జనం ఆలోచనల్లో పెద్దగా మార్పు రాలేదని, నష్ట భయం లేని స్థిరమైన రాబడి కోసమే అంతా ఎఫ్డీలపై మక్కువ చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 2017లో సెబీ చేసిన సర్వేలో 95 శాతం మంది ఎఫ్డీలకే ఓటేస్తే… కేవలం 5 శాతం మంది మాత్రమే షేర్లు, మ్యూచువల్ ఫండ్లను ఎంచుకున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతుండటంతో… ఎఫ్డీలు చేసే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.