AP: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా.. ఎప్పుడో కనుమరుగైన అంశం. మళ్లీ లేవనెత్తింది వైసీపీ. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మరోసారి ‘ప్రత్యేక’ ప్రస్తావన తీసుకొచ్చింది.
అప్పుడప్పుడు ఢిల్లీ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం పలువురు వైసీపీ నాయకుల నోళ్లలో నానుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. బెంగళూరు మెట్రోకు కేటాయించినట్లుగానే విశాఖ మెట్రోకు కేంద్రం నుంచి 20 శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యంతరం తెలిపారు.
ప్రత్యేక హోదాను వైసీపీ వదిలేయలేదని గుర్తు చేయడానికే.. ఇలా అప్పుడప్పుడూ స్పెషల్ స్టేటస్ గొంతుక వినిపిస్తుంటారు ఆ పార్టీ ఎంపీలు. ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసిన ప్రతీసారి ఆయన ఇచ్చే డిమాండ్ల జాబితాలో ఏపీకి ప్రత్యేక హోదా అనే పదం జత చేస్తూ ఉంటారు. ఇక అంతే. మళ్లీ సైలెన్స్. ఇదంతా రొటీన్ గా చేసే డిమాండేనంటూ లైట్ తీసుకుంటున్నారు ఏపీ ప్రజలు.