RevanthReddy: కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపునకు అప్పగించినట్టు ఉందని.. ఎనిమిదిన్నర ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ములుగు జిల్లాలో 2వ రోజు జోరుగా సాగుతోంది.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు రేవంత్ రెడ్డి. శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలోని ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని సీఎం కేసీఆర్ చెబుతున్నారుగానీ.. యునోస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. తక్షణమే అవసరమైనమేర నిధులు కేటాయించి ప్రాచీన కళా సంపదను కాపాడాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ దగ్గర పురాతన కట్టడాలు, వారసత్వపు సంపదను సీఎం కేసీఆర్ కూలగొట్టి.. తన వాస్తు పిచ్చిని ప్రదర్శించారని మండిపడ్డారు. కేంద్ర ఆధ్వర్యంలోని ఆర్కియాలజి డిపార్ట్మెంట్ సైతం నామామాత్రంగా పని చేస్తోందని.. రామప్పను డెవలప్ చేయడం లేదని విమర్శించారు.
రెండోరోజు పాదయాత్రలో భాగంగా వ్యవసాయ కూలీలను కలిసి వారి సమస్యలు, కేసీఆర్ పాలనపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కూలీలు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని.. పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూలీలతో ముచ్చటిస్తూ.. వారి సద్ది గిన్నెలోని అన్నాన్ని రుచి చూశారు రేవంత్ రెడ్డి.