Dharma Sandehalu:హిందూ సంప్రదాయంలో చాలా ఆచారాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు. ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. ఎడమకాలు పెడితే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. దీనికి రామాయణంలోని సన్నివేశంతో ముడిపడి ఉంది.
రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట. కుడికాలు లోపలికి పెట్టి ప్రవేశిస్తే రావణరాజ్యం సకల సంతోషాలతో ఉంటుందని భావించిన హనుమంతుడు రావణ రాజ్యంలోకి ఎడమ కాలు పెట్టి ప్రవేశించాడు. ఈ విధంగా రావణాసురుడి రాజ్యాన్ని హనుమంతుడు అంతం చేశాడు.
అందుకోసమే ఏదైనా శుభకార్యాలప్పుడు లేదా ఎవరికైనా మంచి జరగాలని ఆశించినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడి కాలు పెట్టి లోపలికి ప్రవేశించడం వల్ల ఆ కుటుంబం సుఖ సంతోషాలను కలిగి ఉంటారని చెబుతారు. ఎడమ కాలు లోపల పెట్టి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కలహాలు, గొడవలు తలెత్తుతుంటాయి. అందుకోసమే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లేదా కొత్తగా పెళ్లి అయిన వారు కుడికాలు లోపలికి పెట్టి వెళ్లటం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుంది
ఏదైనా గొడవ పెట్టుకోవాలని వచ్చేవాళ్లు ఎడమ పాదమే ముందుగా మోపుతారని ఆంజనేయుడి వైఖరి మనకు చెబుతోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని తెలుపుతుంది. అప్పటి నుంచి ఎడమ పాదం ముందుగా ఇంట్లోకి పెడితే.. అక్కడ ఎప్పుడూ గొడవలు… సమస్యలతో కాపురంలో కలహాలు ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం స్థిరపడిపోయింది. విశ్వంలోని గ్రహాలకు మనిషి శరీరంలోని భాగాలకు సంబంధం ఉందని శాస్త్రం చెబుతోంది.శరీరంలోని ఎడమ భాగానికి బుధుడు, కుడి భాగానికి బృహస్పతి, హృదయానికి శుక్రుడు, మోకాళ్లకు శని, పాదాలకు రాహుకేతువులు ప్రాధాన్యం వహిస్తారు.