Earthquake: అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న వినాశనం అంతా ఇంతా కాదు. ప్రకృతికి తీవ్ర నష్టం చేస్తున్నాడు. అయితే ప్రకృతి కూడా కన్నెర్రజేసి భూకంపాలు, సునామీల పేరుతో ప్రతీకారం తీర్చుకుంటోంది. నిత్యం పలు దేశాల్లో భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు.
భూ ఫలకాల కదలికల వల్లే భూకంపాలు చోటుచేసుకుంటాయి. అయితే సున్నితమైన ప్రాంతాల్లో భూ ఫలకాలు ఎక్కువగా కదలడం వల్ల అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. జపాన్, ఇండోనేషియా, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండడంతో ఈ దేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి.
ఈక్వెడార్లో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉండడం వల్ల అక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఒక్క 2021లో ఈ దేశంలో ఏకంగా 23,735 సార్లు భూమి కంపించింది.
జపాన్.. భూకంపాలు, సునామీలకు పుట్టిన ఇల్లు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ దేశ భూభాగం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నిత్యం భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. అక్కడి ప్రభుత్వం కూడా భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు తట్టుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక భూకంపం అనగానే గుర్తొచ్చే మరో దేశం ఇండోనేషియా. ఇక్కడ చిన్న, మధ్యస్థాయి భూకంపాలు సర్వసాధారణం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఈ దేశం ఉండడంతో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.
ఫిలిఫ్పీన్స్.. ఈ దేశంలో కూడా నిత్యం భూకంపాలు వస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్కు సరిహద్దుల్లో ఈ దేశం ఉన్నప్పటికీ భూకంపాలు మాత్రం తరచూ సంభవిస్తుంటాయి. ఈ దేశంలో భూకంపాల వల్ల అగ్నిపర్వతాలు పేలిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.