TS Highcourt : ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సమయం కోరింది. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్.
ఎమ్మెల్యేల ఎర కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకు ఇవ్వాలన్న తీర్పుపై రెండు వారాలు సస్పెన్షన్ ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని విజ్ఞప్తి చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి బెంచ్ను ఏజీ కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు హైకోర్టు అంగీకరించింది.
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా సాగింది. ఈ కేసు విచారణ కోసం తొలుత తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలతోపాటు న్యాయవాది శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సింగిల్ జడ్జి… కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ డిసెంబర్ 26న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.