Earthquake: టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం శిథిలాల కింద వేచిచూస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది.
ఇక భూ ప్రకంపనల ధాటికి టర్కీలోని హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. పగుళ్లు ఏర్పడి రన్వే రెండు ముక్కలుగా చీలిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం రెండుగా చీలిపోయిన రన్వేకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిసి దాదాపు 5,600 భవనాలు నేలమట్టమయ్యాయి. 4,500 మందికిపైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 20 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 20 వేల మందికి పైగా మృత్యువాత పడి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది.
భారత్ సహా అనేక దేశాలు ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఇవాళ భారత్ సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక సామాగ్రితో కూడిన ఓ విమానాన్ని టర్కీకి పంపించింది.