Borugadda Anil : గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న బోరుగడ్డ అనిల్ క్యాంపు కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆఫీస్ పై పెట్రోలు పోసి తగులబెట్టారు. భారీగా ఎగిసిపడిన మంటలకు కార్యాలయంలో ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఏపీవ్యాప్తంగా అలజడి రేపింది.
ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఫోన్లో బోరుగడ్డ అనిల్ బెదిరించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యాలయం తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కార్యాలయాన్ని దగ్ధం చేయడంపై బోరుగడ్డ అనిల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డే తన ఆఫీస్ ను తగులబెట్టించారని ఆరోపించారు. కోటంరెడ్డికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కొందరు సహకరించారని ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ ఫోన్ లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి కడపకు ఈడ్చుకు వెళతానంటూ హెచ్చరించడం తీవ్ర కలకలం రేపింది. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ఫోన్ లో అనిల్ .. శ్రీధర్ రెడ్డిని నిలదీశారు.
బోరుగడ్డ అనిల్ ఫోన్ కాల్ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. బెదిరింపులకు తగ్గదేలేదని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి.. అనిల్ చేత తనను బెదిరించారని ఆరోపించారు. తనకు ఆడియో కాల్స్ వస్తే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి సజ్జలకు వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరికలు పంపారు. ఇలా వైసీపీ నేతలకు కోటంరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ఆఫీస్ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టడం మరో వివాదాన్ని రేపింది. టీడీపీ నేతల సహకారంతో కోటంరెడ్డి తన ఆఫీస్ ను తగులబెట్టించారని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.