Capital : ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ కొద్దిరోజుల కిందట రాజధానిపై చేసిన ప్రకటన తీవ్ర రాజకీయ అలజడి సృష్టించింది. త్వరలో విశాఖ రాజధాని కాబోతోందని సీఎం ప్రకటించగానే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తామని జగన్ స్పష్టం చేయడంపై మండిపడ్డాయి. అమరావతే రాజధానిగా ఉండాలని టీడీపీ, బీజేపీ స్పష్టం చేశాయి. రాజధాని వివాదం సుప్రీంకోర్టులో ఉండగా సీఎం ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించాయి. ఈ విషయాలను సీఎం జగన్ లైట్ గా తీసుకున్నారు. తన శైలిలోనే రాజధాని తరలింపుపై అనధికారికంగా చర్యలు ప్రారంభించారు. వేగంగా విశాఖకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు.
విశాఖకు రాజధాని తరలింపు పనులపై స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అధికారికంగా ఆదేశాలు ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే మౌఖిక ఆదేశాలు అందాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజధాని తరలింపుపై ఆదేశాలు ఎప్పుడొచ్చినా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను పరిశీలిస్తున్నారు. పరిపాలన విశాఖ నుంచి సాగేందుకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
బీచ్ రోడ్డులో సీఎం ఇల్లు?
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నివాసం కోసం అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. బీచ్ రోడ్డులో ఇళ్లను పరిశీలిస్తున్నారు. మార్చి 22, 23 తేదీల్లో సీఎం జగన్ గృహ ప్రవేశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. వీఎంఆర్డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రహదారి విస్తరణ పనులను చేపట్టారు. ఈ మార్గంలోనే సీఎం జగన్ నివాసం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది మంత్రులు కూడా ఇళ్లు కోసం వెతుకుతున్నారట. ఐఏఎస్ అధికారులు విశాఖలో నివాసాల కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఏఎంసీ అంకోశా సమీపంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల కోసం చేపట్టిన డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.
మొత్తంమీద ఏపీ సీఎం జగన్ తన చెప్పిన మాట ప్రకారమే విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి నుంచి రాజధాని విశాఖకు తరలిపోకుండా ప్రతిపక్షాలు ఎలాంటి పోరాటం చేస్తాయి? రాజధాని తరలింపును అడ్డుకోగలవా? సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు మార్చగలరా?