Turkey, Syria Earthquake : టర్కీ, సిరియాలో వరుసగా సంభవించిన భూకంపాలు ఇప్పటి వరకు 4,500 మందినిపైగా బలితీసుకున్నాయి. వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల్లోనూ భూకంపం సంభవించిన ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. ఎటు చూసినా భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో బాధితుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఆత్మీయులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారి రోదనలు మిన్నంటుతున్నాయి. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి.
మరుభూమిగా టర్కీ
ఆగ్నేయ టర్కీ , ఉత్తర సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో టర్కీలో 3 వేలకు పైగా భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ఇప్పటికీ వందల మంది చిక్కుకొని ఉన్నారు. గాజియాన్తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత వరుసగా భారీ ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. టర్కీ 10 ప్రావిన్సుల్లో జనం భారీగా మృత్యువాతపడ్డారు. ఇళ్లు కూలిపోవడంతో బాధితులు మసీదుల్లో ఆశ్రయం పొందుతున్నారు.
సిరియాలో విలయం
సిరియాలోని అలెప్పో, హామా సహా పలు నగరాల్లోనూ ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. క్షణాల వ్యవధిలో శిథిలాలుగా మారిపోయాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాకు ఇప్పుడు భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దేశంలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 40 లక్షల మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. అలాగే ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం వణికించింది. ఇప్పటికే బాంబు పేలుళ్ల కారణంగా దెబ్బతిన్న భవనాలు.. తాజాగా భూకంపం ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వరుస ప్రకంపనలు..
తొలి భూకంపం వచ్చిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే.. టర్కీ , సిరియాల్లో వరుస ప్రకంపనలు సంభవించాయి. రెండో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. తొలి భూకంప కేంద్రానికి సమీపంలోనే.. టర్కీలోని ఎకినజు పట్టణంలో రెండో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత 6.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిలో చాలామంది మృత్యువాత పడ్డారని అంచనా వేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.