Earthquake: ఉదయం అతిభారీ భూకంపం. రిక్టర్ స్కేలు మీద 7.8 గా నమోదు. 640మందికి పైగా దుర్మరణం.
మధ్యాహ్నం మరోసారి భారీ భూకంపం. ఈసారి రిక్టర్ స్కేలు మీద 7.5 తీవ్రత. చనిపోయిన వారి సంఖ్య 1600 దాటేసినట్టుగా అప్ డేట్.
సాయంత్రం మళ్లీ పెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై 6 గా నమోదు. మృతుల సంఖ్య 2,300కు పైగా.
మూడు మేజర్ ఎర్త్ క్వేక్స్ మధ్యలో అనేకం చిన్నచిన్న కంపనాలు. గంట కూడా గ్యాప్ లేకుండా వణికించేస్తున్నాయి.
పాపం.. టర్కీ, సిరియా. వరుస భూకంపాలతో ఆగమాగం అవుతోంది. భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్యే వేలల్లో ఉంది. క్షతగాత్రులైతే లెక్కే లేదు. అంతకంతకూ మరణాలు పెరిగిపోతున్నాయి. అంతా మృత్యుఘోష.
వేలాది భవనాలు పేకమేడలా నేలకూలాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వేల మందిని వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వాటికి ఆటంకంగా మళ్లీ మళ్లీ భూప్రకంపణలు వస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే మూడుసార్లు భారీ భూకంపాలు రాగా.. మరో 50 వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2వేలకు పైగా నమోదైంది. 10వేల మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. రాత్రి ఎలా గడుస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు స్థానికులు.