Earthquake: టర్కీ, సిరియాలో అతిభారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.8 & 7.5 తీవ్రతతో రెండుసార్లు విరుచుకుపడింది ఎర్త్ క్వేక్. ఏకంగా 1600 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయపడ్డారు. చరిత్ర చూడని విషాదం ఇది. రెండు దేశాల్లోని అనేక నగరాలు కుప్పకూలిన దుర్ఘటన ఇది. ఇంతటి పెను ప్రమాదాన్ని కాస్త అలర్ట్ గా ఉండి ఉంటే ఇంతటి ప్రాణనష్టం జరిగి ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ స్థాయిలో భూకంపం వస్తుందని ఓ సైంటిస్ట్ ముందే హెచ్చరించారు. కానీ, ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతను చెప్పినట్టే అదే ప్రాంతంలో, అంతే తీవ్రతతో భూకంపం రావడంతో ఇప్పుడంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…
భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే(SSGEOS) సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్.. తాజా విపత్తును మూడు రోజుల ముందే అంచనా వేశారు. ‘త్వరలోనే దక్షిణ మధ్య టర్కీ, జొర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ట్వీట్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే.. అదే ప్రాంతంలో, 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. ముందే మేల్కొని ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఈ భూకంపం తనను ఎంతో కలిచివేసిందన్నారు ఫ్రాంక్ హూగర్బీట్స్. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామన్నారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఫ్రాంక్ హూగర్బీట్స్ అన్నట్టుగానే.. గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.