Adani:హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక తర్వాత గ్రూపు షేర్లు భారీగా పతనం కావడంతో… ఆదానీ ఆస్తిలో సగానికి పైగా కరిగిపోయింది. రోజూ అదానీ కంపెనీల షేర్లు పడిపోవడమే తప్ప… పెరిగే సూచనలు కనిపించడం లేదు. దాంతో… ఆయన సంపద ఇంకా క్షీణించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో… అదానీ కంపెనీలకు ఇచ్చిన అప్పులను రాబట్టుకునేందుకు.. బ్యాంకులు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నాయనే ఊహాగానాలు సాగుతున్నాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్, దాని అనుబంధ కంపెనీలు తీసుకున్న మొత్తం అన్సెక్యూర్డ్ రుణాలు… రూ. 11,574 కోట్లు. అంత భారీ మొత్తాన్ని అప్పుగా ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు… ఇప్పుడు రుణాల్ని రీకాల్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్-ఎఫ్పీవోను ఉపసంహరించుకోవాలని అదానీ ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంతో… ఇకపై అదనపు వనరులు సమీకరించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా అంగీకరించిన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం రుణాల్ని తిరిగి చెల్లించలేకపోవచ్చని… అప్పు ఇచ్చిన వాళ్లు ఎప్పుడైనా రీకాల్ చేసే అవకాశం ఉందని… అదానీ గ్రూప్, పెట్టుబడిదారులకు వెల్లడించింది. అదే జరిగితే తమ అనుబంధ సంస్థలు ఫైనాన్సింగ్ కోసం ప్రత్యామ్నాయాల్ని చూసుకోవాల్సి ఉంటుందని అదానీ పేర్కొన్నారు. అయితే బలమైన నగదు ప్రవాహం, సురక్షితమైన ఆస్తులతో గ్రూప్ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని చెబుతున్న గౌతమ్ అదానీ… రీకాల్ అంచనాలపై ఎలా స్పందిస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు… రుణాల కోసం స్టాక్స్ను తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్… ఇప్పుడు షేర్లపై తీసుకున్న నిధులను ముందుగానే తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంది. రుణాల చెల్లింపు కోసం తాకట్టు పెట్టిన 168 మిలియన్ షేర్లను విడుదల చేయనుంది… అదానీ గ్రూప్. ఇది ప్రమోటర్ల వాటాలో 12 శాతానికి సమానం. 2024లో మెచ్యూరిటీకి ముందే అప్పులు చెల్లించి… ప్రమోటర్ పరపతిని తగ్గించడమే లక్ష్యమని అదానీ గ్రూప్ తెలిపింది.