Veerabhadra and Draksharama:దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం… సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివున్ని కోరుతుంది. భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు. శివున్ని ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ని అవమానిస్తాడు.
భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రున్ని సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు. సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరున్ని బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. ఆ శరీర అవయవాలే దేశంలో 18 చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు చెబుతారు.
ఆ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దక్ష ప్రజా పతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని, కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారింది. దేవాలయ గోడలపై 800 ఏళ్లకిపైగా శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 1100 సంవత్సరాల క్రితం నిర్మించినా.. అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలశారనీ ప్రతీతి. ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందటంతోపాటు.. చాళుక్యుల శిల్పకళా రీతికి అద్దంపట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరుగాంచింది.
వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు.. వ్యాసుడికి, ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తయిదువులాగా వచ్చి.. వ్యాసుడికి, ఆయన శిష్యబృందానికి బిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు.. కాశీలో భోగులకు స్థానం లేదనీ, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్య కిరణాలు భీమైశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి.