Brahmotsavam:శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి. తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు నిర్వహించలేదు. ఈసారి పరిస్థితులు అంతా సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8.40 నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 15న రాత్రి గరుడ వాహనము, 16న సాయంత్రం 4 గంటలకు బంగారు రథం, 18న రథోత్సవం, 19న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో పరిణయం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరగా.. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వరకు కొండ ఎక్కకూడదని పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదని అగస్త్య మహర్షి చెప్పారట. దీంతో స్వామివారు దేవేరితో కలిసి అగస్త్య ఆశ్రమంలోనే 6నెలలపాటు విడిది చేశారట. ఆరునెలల తర్వాత తిరుమల కొండకు పయనమైన స్వామివారు భక్తులకు రెండు వరాలను ప్రసరించారని పురాణాల కథనం.
ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దాని కంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాలా దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండే ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు గంట లోపలే తిరుమల కొండ పైకి వెళ్లవచ్చు..