Telangana Budget 2023: కేసీఆర్ సర్కారుపై అనేక విమర్శలు వినిపిస్తుంటాయి. చాలామంది నిలదీసే అంశం డబుల్ బెడ్ రూం ఇండ్లు. అరచేతిలో స్వర్గం చూపించినట్టు.. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లంటూ ఆశ రేకెత్తిచ్చిందే కేసీఆర్. హామీ అయితే ఇచ్చారు కానీ.. ఏ కొద్దిమందికో మినహా ఎవరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు రాలేదు.
పోనీ, సొంతంగా స్థలం ఉంది. తామే ఇల్లు కట్టుకుంటాం. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు ఇదే కాన్సెప్ట్. డబుల్ బెడ్ రూమ్ పేరు చెప్పి.. కాంగ్రెస్ హయాం నాటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎత్తగొట్టేశారు. దీంతో ఇల్లు రాక.. ఇల్లు కట్టుకోలేక సామాన్యులు నానాఅవస్థ పడుతున్నారు.
అసలే ఎన్నికల సమయం. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బాగా ఉన్నట్టు కనబడుతోంది. ఇండ్ల కోసం డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో సర్కారు కాస్త దిగొచ్చింది. కాంగ్రెస్ కు ఓట్లు కురిపించిన ఇందిరమ్మ ఇండ్ల కాన్సెప్ట్ ను కాస్త మార్చి.. తాజా బడ్జెట్ లో కొత్తగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత స్థలం ఉండి.. ఇల్లు కట్టుకునే వారికి.. రూ.3 లక్షలు ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించింది. కాకపోతే కండిషన్స్ అప్లై.
ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు మాత్రమే ఈ ఆఫర్. ఒక్కో నియోజకవర్గంలో 2వేల మందిని ఎంపిక చేస్తారు. అలా, రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో 2,38,000 మంది లబ్దిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సహయం చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం బడ్జెట్లో 7,890 కోట్లు ప్రతిపాదించినట్టు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
అయితే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సొంతింటి కోసం చిరకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు.. సర్కారు ఇస్తామంటున్న రూ.3 లక్షలు ఏమూలకు? అందులోనూ, కొందరికే ఇస్తామంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఈ పథకం సర్కారుకే బూమరాంగ్ అవుతుందా? అనే అనుమానాలు.