Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క సారక్క ఆలయంలో పూజలు చేసి.. యాత్రను ప్రారంభించారు. గద్దెలపై కొలువున్న అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తులాభారంతో తన బరువుతో సమానమైన బంగారాన్ని దేవేరులకు సమర్పించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ పెద్దల సమక్షంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ కు పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనం పలికారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టారు. సుమారు రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి జనంలో ఉండనున్నారు. పాదయాత్రలో భాగంగా.. జనం సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంతో వారికి మరింత దగ్గరయ్యేందుకు ఈ యాత్ర చేపట్టారు. ఇవాళ మేడారం నుంచి రామప్ప వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.