Oil: ఉక్రెయిన్, రష్యా వార్. ఆ రెండు దేశాలకు అనేక నష్టాలను, కష్టాలను తీసుకొచ్చింది. కానీ, ఇండియాకు మాత్రం ఓ విషయంలో బాగా లాభం చేసింది. అదే ఆయిల్ కొనుగోలు వ్యవహారం. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి ప్రపంచదేశాలు. అలా రష్యాను ఆర్థిక ఇబ్బందుల్లో పడేయాలనేది వాటి ప్లాన్. అందుకు విరుగుడుగా.. రష్యా ఆయిల్ తో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. రండి బాబూ రండి.. అతితక్కువ ధరకే ఆయిల్ అమ్ముతామంటూ బిగ్ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ ఆఫర్ ను భారత్ బాగా క్యాష్ చేసుకుంటోంది. రష్యా చమురు ఎవరూ కొనొద్దంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయకుండా.. తక్కువ రేటుకే వస్తోందని మనోళ్లు పెద్ద మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. ఆ దిగుమతులు రికార్డు స్థాయికి చేరడం లేటెస్ట్ అప్ డేట్.
ఉక్రెయిన్ తో వార్ కు ముందు రష్యా నుంచి ఇండియాకు క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే ఉండేది. గల్ఫ్ కంట్రీస్ పైనే ఎక్కువగా ఆధారపడేది. ఇప్పుడు చీప్ గా వస్తోంది కదాని.. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొంటోంది. దీంతో.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఏకంగా 28 శాతానికి పెరిగాయి. ఒక్కడి 1 శాతం.. ఇంకెక్కడి 28 శాతం. ఈ లెక్క చూస్తుంటే తెలుస్తోందిగా మనోళ్లు రష్యా చమురును తెగ తాగేస్తున్నారని.
రష్యా తర్వాత ఇరాక్ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం)ల నుంచి ఇండియా అధికంగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. రష్యా ఆయిల్ను చైనా, భారత్ లే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ ను మన అవసరాలకు వాడుకుంటూనే.. ఆ ముడి చమురును శుద్ధి చేసి అమెరికాకు కూడా ఎగుమతి చేస్తోంది ఇండియా. అలా అదనపు ఆదాయం కూడా ఆర్జిస్తోంది. అయితే, ఇదంతా అమెరికా గేమ్ అని.. రష్యా నుంచి నేరుగా కొనలేక.. భారత్ కొనేందుకు సహకరించి.. ఆ తర్వాత మన నుంచి శుద్ధి చేసిన ఆయిల్ ను అమెరికా కొంటోందని.. పరోక్షంగా అగ్రరాజ్యమూ లాభపడుతోందనే వాదనా వినిపిస్తోంది.
ఇదంతా సరేగానీ.. చమురు అంత చీప్ గా వస్తున్నప్పుడు.. ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎందుకు తగ్గట్లేదు? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు సగటు భారతీయుడు.