Delhi Mayor : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. గతంలో రెండుసార్లు కౌన్సిల్ లో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తాజాగా మూడోసారి అదే పరిస్థితి తలెత్తింది.
మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యా శర్మ అనుమతి ఇచ్చారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయంపై ఆప్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ లో నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆప్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. ఆప్ కౌన్సిలర్లు మాత్రం కౌన్సిల్ లో నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే సభ మరోసారి వాయిదా పడింది.
గత డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం దుందుభి మోగించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్ పదవి ఆప్కే దక్కనుంది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదని ఆప్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పు వస్తే గానీ ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిగే పరిస్థితి కనిపించడంలేదు.