Balakrishna: ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘అన్స్టాపబుల్-2’ షోలో నర్సులపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు.
రోగులకు సేవలందించే సోదరీమణులంటే తనకెంతో గౌరవమని.. కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించారని బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. రోగులకు రాత్రింబవళ్లు సేవలందించే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పులేదన్నారు. కరోనా సమయంలో నర్సులు ప్రాణాలు పనంగా పెట్టి రోగులకు సేవ చేశారని తెలిపారు. నిజంగా తన మాటలు నర్సుల మానోభావాలు దెబ్బతీస్తే పశ్చత్తాపం వ్యక్తం చేస్తున్నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అసలేం జరిగిందంటే..
అన్స్టాపబుల్-2 షోలో తనకు జరిగిన బైక్ యాక్సిడెంట్ విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తనకు వైద్యం చేసిన నర్సు గురించి మాట్లాడారు. ‘‘నాకు బైక్ యాక్సిడెంట్ అయి ఓ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. పోలీస్ కేసు అవుతదని బయపడి నిజం దాచి కిందపడ్డానని అబద్ధం చెప్పాలనుకున్నా. కానీ, నాకు వైద్యం చేసిన నర్సు అందంగా ఉండడంతో.. దానమ్మ ఆమెను చూసి నిజం చెప్పేశాను’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నర్సులు, నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.