Etala : తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ నేతలు పెదవి విరిచారు. శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ మాదిరిగా ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హరీశ్ రావు 89 పేజీల బడ్జెట్ పుస్తకాన్ని 140 నిమిషాలపాటు అనర్గళంగా చదివారని సెటైర్లు వేశారు. ఈ బడ్జెట్ తో సామాన్యుడికి ఒరిగేదేది లేదని మండిపడ్డారు. మాటల్లో చెప్పిన గొప్ప దార్శనికతను హరీశ్ రావు ఆచరణలో చూపించాలని ఈటల సూచించారు.
హామీల సంగతేంటి?
గత ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఆ హామీ సంగతేంటని నిలదీశారు. నాలుగున్నర ఏళ్లు అయినా ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని.. ఆ హామీ నెరవేర్చేదెప్పుడని ప్రశ్నించారు.
జీతాలు ఇవ్వరా?
ఉద్యోగులకు నెల మొదటివారంలోపు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగులు వీఎంఐలు సమయానికి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడంలేదని ఆరోపించారు. విద్యా వాలంటీర్లు జీతాలు అందడంలేదన్నారు. అంగన్ వాడీ లో సరుకులా సరఫరా సరిగ్గా జరగడంలేదని ఆరోపించారు. నిధులు ఇవ్వకపోవడమే దీనికి కారణమన్నారు. ఇదే పరిస్థితి రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొందని ఆరోపించారు. అందువల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీకి నిధులు కేటాయించకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడంలేదన్నారు. కేసీఆర్ కిట్ సకాలంలో ప్రజలకు చేరడంలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. నిధుల సమస్య ఉన్నా ప్రభుత్వం గొప్పలకు పోతోందని మండిపడ్డారు. బడ్జెట్ లోనూ అదే ధోరణి కనిపించిందని ఈటల విమర్శించారు. బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టడం కాదు.. ఆ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.