Supreme Court : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ .. కొత్త జడ్జీల చేత ప్రమాణం చేయించారు. దీంతో సుప్రంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ఉన్నారు. రెండో తెలుగు వ్యక్తిగా ఇప్పుడు జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్కుమార్ అవకాశం దక్కించుకున్నారు . ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు. జస్టిస్ సంజయ్కుమార్ 1963 ఆగస్టు 14న హైదరాబాద్లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాది జీవితాన్ని ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజయ్ కుమార్ పదోన్నతి పొందారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గతేడాది డిసెంబర్ 13న ఐదుగురు జడ్జీల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల విషయంలో సుప్రీంకోర్టు, కేంద్రానికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయితే ఈ సిఫార్సులకు ఇటీవల కేంద్రం ఆమోదముద్ర వేసి నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు కొలీజియం గత నెలలో సిఫార్సులు పంపించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రెండు ఖాళాలను భర్తీ చేస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంటుంది.