Turkey : టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. బాధితులను రక్షించేందుకు టర్కీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూకంపం తర్వాత టర్కీలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మృతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సిరియాకు సరిహద్దుగా గజియాన్టెప్ ప్రాంతం ఉంటుంది. టర్కీకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం ఇక్కడే ఉంది. లెబనాన్, సిరియా, సైప్రస్లోనూ భూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది.
టర్కీలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. 1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది మృత్యువాత పడ్డారు. ఇది ఒక ఘోర విపత్తుగా టర్కీ చరిత్రలో నిలిచిపోయింది. 2020 జనవరిలో ఎలజిగ్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అయిజీన్ సీ ప్రాంతంలో 114 మంది భూకంపానికి బలయ్యారు.