AP CS : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే సీఎం సతీమణి భారతి వద్ద పనిచేసే నవీన్ ను సీబీఐ అధికారులు ఈ నెల 3న కడపలో విచారించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు వచ్చాయి.
సీఎస్ వైయస్ఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 3న కడప కేంద్ర కారాగారం మీదుగా వెళ్తూ ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు వెళ్లారని… అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఖండించారు.
సింహాద్రిపురం మండలం అహోబిలపురం భానుకోట సోమేశ్వరాలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 2న తాను రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటల సమయంలో వైయస్ఆర్ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించారు. అదేరోజు మధ్యాహ్నం ముద్దనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యామని చెప్పారు. ఈ కార్యక్రమం ముగియగానే సాయంత్ర 4.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరానని వివరించారు. రాత్రి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. కడప కలెక్టర్, ఇతర అధికారులు తనకు వీడ్కోలు పలికారని చెప్పారు. రాత్రి 9 గంటలకు స్పైస్జెట్ విమానంలో హైదరాబాద్కు చేరుకున్నానని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు. తనపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదని స్పష్టం చేశారు.