Uttam Kumar Reddy : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ ఈ నెలాఖరు నాటికి రద్దు అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ మతపరంగా విభజిస్తోందని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకం, మట్టి, ఇసుక తవ్వకాలు, మద్యం సిండికేట్ లో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్నగర్లో కాంగ్రెస్కు 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.
శాసనసభ రద్దు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన ఈ కామెంట్స్ చేశారో ఎవరికీ అర్థం కావడంలేదు.