KCR : దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ ముగిసిన తర్వాత గులాబీ బాస్ ప్రెస్ మీట్ పెట్టారు. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఏటా 1.40 లక్షల టీఎంసీల వర్షం కురుస్తోందని వివరించారు. దేశంలో సాగుకోసం 40 వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు అని కేసీఆర్ అన్నారు.
నీటి యుద్ధాలు ఎందుకు?
రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2004లో వేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇప్పటి వరకు నీటి వాటాలు తేల్చలేదని మండిపడ్డారు. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు? అని ప్రశ్నించారు. భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే జల విధానం పూర్తిగా మార్చేస్తామన్నారు. దేశంలో కీలక ప్రాంతాల్లో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు.
విద్యుత్ కోతలెందుకు?
మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉందని కేసీఆర్ చెప్పారు. అయినా సరే అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ నీరు, విద్యుత్ కొరత ఉందని తెలిపారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. న్యూయార్క్, లండన్లో కరెంట్ పోవచ్చుగానీ హైదరాబాద్లో పవర్ కట్ ఉండదని తేల్చిచెప్పారు.
బొగ్గు దిగుమతిపై మతలబు ఏంటి?
దేశంలో పుష్కలంగా బొగ్గు లభ్యమవుతుండగా విదేశాల నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. దీని వెనకున్న మతలబు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. దీంతో 125 ఏళ్లపాటు దేశమంతటికీ విద్యుత్ ఇవ్వొచ్చని చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థలను కేంద్రం ఎందుకు ప్రోత్సహిస్తోందని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 90 శాతం విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తారా?
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉందని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా మాటలతో కాలం గడుపుతోందని విమర్శించారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెబుతున్నారని.. ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు.
అదానీ వేగంగా ఎలా ఎదిగారు?
ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతున్నా ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను భారత్ ఎందుకు ఆకర్షించడం లేదని ప్రశ్నించారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కేసీఆర్ స్పష్టం చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..
మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుత ప్రగతి సాధిస్తుందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.