Revanthreddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ఈ యాత్ర సాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చేసే ప్రాంతం నుంచి రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.
సోమవారం ఉదయం 8 గంటలకు రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుడతారు.
తొలుత మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నగర్లో భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తీసుకుంటారు. అనంతరం పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుంటారు రేవంత్రెడ్డి. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.