Betting Apps : రుణ, బెట్టింగ్ యాప్ లను నిషేధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. కొన్ని యాప్ లు సామాన్యులకు రుణాలు ఇచ్చి దోపిడీ చేస్తున్నాయి. రుణ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నాయి. రుణ యాప్ ల వేధింపులు భరించలేక చాలా మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘రుణ’ యాప్ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్ యాప్లు, 94 రుణ చెల్లింపుల యాప్లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించేందుకు సిద్ధమైంది. కేంద్ర ఐటీశాఖకు హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఈ యాప్లను బ్లాక్ చేసే ప్రక్రియను ఇప్పటికే ఐటీశాఖ ప్రారంభించినట్లు సమాచారం.
కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ యాప్లపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ 6 నెలల క్రితం 28 చైనా రుణ చెల్లింపు యాప్లను విశ్లేషించింది. 94 యాప్లు ఈ-స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని గుర్తించింది. మరికొన్ని థర్డ్-పార్టీ లింక్ల ద్వారా పనిచేస్తున్నాయని తేల్చింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం ఈ యాప్లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని తేల్చిన తర్వాత కేంద్రం చర్యలు ప్రారంభించింది. చైనా ఈ యాప్లకు డైరెక్టర్లుగా భారతీయలను నియమించి తమ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆర్థిక అవసరాలకు ఈ యాప్ల ద్వారా రుణాలు తీసుకొనేందుకు కొందరు ఆకర్షితలవుతున్నారు. ఆ తర్వాత యాప్ నిర్వాహకులు వడ్డీని పెంచేస్తున్నారు. రుణం తీసుకున్నవారు వడ్డీని చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఈ యాప్లకు చెందిన ప్రతినిధులు వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. వారి ఫోన్లో ఉన్న ఫొటోలను తీసుకొని మార్ఫింగ్ చేసి వాటిని బయటపెడతామని బెదిరిస్తున్నారు. రుణ యాప్ ల వేధింపులతో దేశంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
2020 జూన్ నుంచి కేంద్ర ప్రభుత్వం 2 వేలకు పైగా చైనా యాప్లపై నిషేధం విధించించింది. వీటిలో టిక్టాక్, షేరిట్, వియ్చాట్, హలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్ యాప్లు ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని యాప్ లను నిషేధించే ప్రక్రియను ప్రారంభించింది.