FarmHouse Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన మెయినాబాద్ ఫామ్ హౌజ్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించనుందా? ఇప్పటికే సింగిల్ బెంచ్.. సిట్ దర్యాప్తును రద్దు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసును సీబీఐకి అప్పగించే పిటిషన్ తీర్పును.. ఈనెల 6న వెలువడనుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కేసులో ఉన్న నిందితులు హైకోర్టు సింగిల్ను బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో సీబీఐకి అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. తీర్పును ఈనెల 6వ తారీఖుకు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంలో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించారు. అయితే తమను కావాలనే కేసులో ఇరికించారని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిందితులు హై కోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. సిబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా సిట్ దర్యాప్తును రద్దు చేసి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన డివిజన్ బెంచ్.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా దీనిపై ఈనెల 6న తీర్పు వెలువడేలా హైకోర్టు లిస్టింగ్ లో పెట్టింది.
ఇక దీనిపై ఈ నెల 6న తీర్పు వెలువడనుండడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉత్కంఠ నెలకొంది. ఇదే రోజు తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ విషయంలో ఎలాంటి ప్రతిస్పందనలు ఎదురవుతాయోనని అనుకుంటున్న ప్రభుత్వానికి.. ఇదే రోజు ఫాం హౌజ్ కేసు తీర్పు ఉండడం మరింత టెన్షన్ పెడుతున్నది.