kotamreddy: జగన్ సర్కారు యాక్షన్ డోసు పెంచింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని మరింతగా టార్గెట్ చేసింది. ఇప్పటికే పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి వేటు వేసింది వైసీపీ. ఇప్పుడిక ప్రభుత్వం తరఫున చర్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి ఉన్న పోలీస్ సెక్యూరిటీని తగ్గించింది. ప్రస్తుతం 2+2 గన్ మెన్లు ఉండగా.. భద్రతను 1+1కు కుదించడం సంచలనంగా మారింది.
అసలే, కోటంరెడ్డి సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ నానాయాగీ చేస్తున్నారు. తనను విమర్శిస్తున్న వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఓ కార్పొరేటర్ తనపై కిడ్నాప్ కేసు పెట్టించినా తగ్గేదేలే అంటున్నారు. కావాలంటే మర్డర్ కేసు కూడా పెట్టుకోండంటూ సవాల్ చేస్తున్నారు. భయపడేది లేదని.. నా గొంతు ఆగాలంటే.. ఎన్ కౌంటర్ చేసుకోండి అంటూ ఛాలెంజ్ కూడా చేశారు.
ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఉన్న భద్రతను తగ్గించడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ నేతకు ప్రాణభయం ఉందని.. కడప నుంచి ఒకరు ఫోన్ చేసి అంతుచూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడని.. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ కుదించడం వల్ల ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. కోటంరెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారా? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు అనుచరులు. కోటంరెడ్డికి జరగరానిది ఏదైనా జరిగితే.. అందుకు వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.