Srisailam Temple:శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈసారి శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ దర్శన విధానాలో పలు మార్పులు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 21 వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజూ జరిగే అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే శివ మాలధారులు, భక్తులు తండోప తండాలుగా శ్రీశైల క్షేత్రానికి పోటెత్తారు.
ఈనెల 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయాల్లో మాత్రమే స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈవో చెప్పారు. అలాగే మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఉచిత దర్శనాలు సైతం బ్రహ్మోత్సవాల ముందు రోజు వరకు మాత్రమే అనుమతించనున్నారు. అదేవిధంగా శివదీక్షా స్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో, శివదీక్షా శిబిరాల వద్ద నిత్యాన్నదానంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.మండల దీక్షలు చేసుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలు పూర్తయిన తరువాత జ్యోతిర్ముడి సమర్పణ కోసం శివదీక్షా శిబిరాల వద్ద అర్చక పండితులచే శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహాశివరాత్రి రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈరోజునే లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శివ, పార్వతుల వివాహం కూడా జరిగిందని శాస్త్రీయ పురాణాలు చెబుతున్నాయి . మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి.. బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు 820కి పైగా బస్సులు నడపనున్నారు. ఉత్సవాలకు 8 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఆలయ కమిటీ.