Find Fake News:సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించడం మొదలుపెట్టిన తర్వాత ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే అవకాశం కూడా చాలావరకు తగ్గిపోయింది. అందుకే మన దగ్గరకు వస్తున్న సమాచారం నిజమా, అబద్ధమా.. అసలు అబద్ధపు సమాచారాన్ని ఎలా గ్రహించాలి అన్న విషయాలపై నిపుణులు పలు సూచనలు అందిస్తున్నారు.
హెల్త్, సైన్స్, ప్రజాస్వామ్యం గురించి కూడా అబద్ధపు సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది సామాజికంగా చాలామందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక అబద్ధపు సమాచారంపై చర్య తీసుకునేలోపే మరో సమాచారం ఆ స్థానాన్ని తీసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంత వేగంగా పనిచేస్తోంది. అందుకే సెన్సార్షిప్ అనేది సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు కూడా ఈ విషయంలో చర్య తీసుకోవాలని ప్రయత్నించిన అది కష్టమైన విషయమని వారు అంటున్నారు. అందుకే నార్త్ అమెరికా, యూకేలోని టెక్ నిపుణులు పలు సోషల్ మీడియా యూజర్లకు పలు సలహాలు, సూచనలు అందించారు.
ఏదైనా వార్త మనవరకు రాగానే దాన్ని వెంటనే షేర్ చేసేయకుండా.. అది నిజమా, అబద్ధమా అని ఆలోచించి.. అసలు ఆ వార్త ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిదన్నారు నిపుణులు. మన దగ్గరకు వచ్చిన వార్త గురించి మరింత సమాచారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తే.. అది నిజమా, అబద్ధమా అని తెలుసుకునే అవగాహన ఏర్పడుతుందన్నారు.
ఒకే వార్త గురించి పలు సోషల్ మీడియా సైట్స్లో చూడడం ద్వారా అది ఎంతవరకు నిజమో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమయం ఉన్నప్పుడు మనకు కావాల్సిన సమాచారం గురించి ఒక సోషల్ మీడియా సైట్ కాకుండా పలు సైట్లు చూడడం మంచిది. ఎన్నో ఫైక్ సైట్ల మధ్య నిజమైన వార్తలను ప్రచురించే సైట్ను కనుగొని దానిపైనే ఎక్కువగా ఆధారపడితే మేలు అని నిపుణులు చెప్తున్నారు.
మనకు నచ్చే అంశం గురించి అవగాహన పెంచుకోవడం వల్ల.. ఒక వార్త మన దగ్గరకు రాగానే అది నిజమా, అబద్ధమా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. విన్న ప్రతీదాన్ని నమ్మొద్దు అని ధృడ నిర్ణయం తీసుకుంటే.. మన దగ్గరకు వచ్చే వార్తను స్టడీ చేయాలన్న ఆలోచన ఏర్పుడుతుంది. అలా అని అందరినీ అనుమానిస్తూ వెళ్లడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కువమందితో టచ్లో ఉండడం వల్ల చుట్టూ జరిగే విషయాల గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా అందరితో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల విషయాలపై అవగాహన మరింత పెరుగుతుంది. రాజకీయపరంగా కూడా తప్పుడు సమాచారాన్ని నమ్మే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నిపుణులు అంటున్నారు.