Raghunandanrao : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తాను సేకరించానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో తెలిపారు. గజ్వేల్కు రూ.890కోట్లు, సిద్ధిపేటకు రూ.790 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు.
ఆ అంశంపై క్లారిటీ ఏది?
గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని రఘునందన్ అన్నారు. 9 ఏళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. గుడిసెలు లేని తెలంగాణను తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో ఏడాదిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. 100 గజాల స్థలం ఉన్న పేదవారికి వారి స్థలంలోనే రూ.5 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి చేయూతనిస్తామని చెప్పారని.. ధరలు పెరిగినందున ఆ సాయాన్ని రూ.7.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న అందిరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు గానీ, ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. దళితబంధును అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని చెప్పారని అది నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు, ఇతరత్రా విషయాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం సమదృష్టిలతో చూడాలని రఘునందన్ రావు కోరారు.
కేంద్రం సహకారం ఉంది..
తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సినవి అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్రావు సభలో వివరించారు. గవర్నర్ తమిళిసై చేసిన బడ్జెట్ ప్రసంగంలోనూ కేంద్రాన్ని విమర్శించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. మెడికల్ కళాశాలలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని రఘునందన్రావు వెల్లడించారు.
తెలంగాణ నుంచి నిధులు వెళుతున్నాయి గానీ రాష్ట్రానికి రావట్లేదని కొంత మంది నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని.. దేశ సమగ్ర స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రాలను ఎలా చూసుకోవాలో కేంద్రానికి తెలుసన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల రాలేదని పదేపదే విమర్శిస్తున్నారని… దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని.. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కేంద్రం ఒక విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే తెలంగాణలో మెడికల్ కళాశాలలు ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో ఇతర ప్రాంతాలకు కేటాయింపులు చేసిందని వివరించారు. అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.